కలం, వెబ్ డెస్క్: ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో విషాదం నెలకొంది. 36వ వార్డ్ ఆరేటి నగర్లోని ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లో విషవాయువు (Toxic Gas Leak) లీక్ అయింది. డ్రైన్ పూడిక తీస్తుండగా విషవాయువు వెలువడి ముగ్గురు కూలీలు అపస్మారక స్థితికి చేరుకున్నారు. విషవాయువు పీల్చి వలపు వెంకన్న (45) అనే కూలీ మృతి చెందగా.. రాజు, ప్రభాకర్ అనే ఇద్దరు కూలీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు వెంటనే వీరిని ప్రైవేట్ ఆసుపత్రికి చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
అయితే భీమడోలు నుంచి పూడిక పనుల కోసం 8 మంది కూలీలు వచ్చారు. రైస్ మిల్లు అని చెప్పి ఆక్వా యూనిట్కు రప్పించి పనులు చేయించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన దృష్ట్యా యాజమాన్యం నిర్లక్ష్యంపై కూలీల కుటుంబ సభ్యులు, వామపక్ష నేతలు ఆందోళన చేపట్టాయి. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

