కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో రైతుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం పనిచేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం రైతుల పట్ల నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో మార్పు తీసుకొస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను నిండా ముంచిందని ఫైర్ అయ్యారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేకపోవడం, ధాన్యం తూకం, తరలింపు, చెల్లింపుల విషయంలో జాప్యం కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు, దళారుల మధ్య రైతులు నలిగిపోతున్నారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పాలనలో రైతులు ఎదుర్కొన్న సమస్యలే ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలోనూ అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం మారినా రైతుల బతుకుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదని, వ్యవసాయ రంగానికి సంబంధించిన విధానాల్లో కూడా పెద్దగా తేడా లేదని అన్నారు.
ప్రత్యేకంగా ధాన్యం సేకరణ విషయంలో ప్రభుత్వ వైఫల్యం బహిర్గతమైందని విమర్శించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, సకాలంలో కొనుగోళ్లు చేపట్టడం, చెల్లింపులు వేగంగా చేయడం వంటి అంశాల్లో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని డిమాండ్ చేశారు. రైతుల కష్టాలను గుర్తించి తక్షణం చర్యలు చేపట్టకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

