కలం, ఖమ్మం బ్యూరో : వేసవి ప్రారంభంలోనే శీతల పానీయాల విషం ప్రజలపై భయంకర ప్రభావం చూపుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట(Ashwaraopet) మండలంలోని కొందరు డీలర్లు కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ను విక్రయించడం కలకలం రేపింది.
మండలంలోని ఊట్లపల్లి గ్రామానికి చెందిన జూపూడి గోపాలరావు ఇటీవల తన చిన్నారులు జై ఈశ్వర్ (4), జయదేవ్ (2)లకు స్థానిక షాపులో స్ప్రైట్ బాటిల్ కొని ఇచ్చారు. పిల్లలు తాగిన వెంటనే తీవ్రమైన వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తదుపరి బాటిల్ను పరిశీలించగా, అది అక్టోబర్ 27, 2025 నాటికే గడువు ముగిసినట్లు గుర్తించారు.
గత ఏడాది అశ్వారావుపేటలోని (Ashwaraopet) ఒక ప్రధాన కోకాకోలా డీలర్ ఇలాగే ఎక్స్పైరీ స్టాక్ను గ్రామాలకు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ప్రజలు ఆందోళన చేయగా, ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్న సదరు డీలర్, ఇప్పుడు మళ్లీ అదే దందాను కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. మండల వ్యాప్తంగా ఇటువంటి అనేక గ్రామాలకు ఈ కలుషిత పానీయాలు సరఫరా అవుతున్నట్లు సమాచారం.
వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా, ఫుడ్ సేఫ్టీ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు తమ పిల్లల ప్రాణాలపై వ్యాపారుల అమానుషికం విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అశ్వారావుపేటలోని శీతల పానీయాల గోడౌన్లపై దాడులు నిర్వహించాలని, కాలం చెల్లిన స్టాక్ను విక్రయిస్తున్న డీలర్ల లైసెన్సులను రద్దు చేసి, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, వేసవి ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే, ముందు ముందు ఇంకెన్ని ప్రాణాలు ప్రమాదంలో పడతాయోనని మండల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Read Also: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. మరో ఇద్దరు అరెస్ట్..!
Follow Us On: X(Twitter)

