కలం, వెబ్ డెస్క్ : విజయవాడలో సంచలనం సృష్టించిన ఉగ్రవాద లింకుల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాకిస్థాన్ హ్యాండ్లర్లో సంబంధాలు ఏర్పరచుకొని సోషల్ మీడియా ద్వారా టెర్రరిస్టు కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురు యువకులను సోమవారం విజయవాడ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ హైదరాబాద్ కు చెందిన సైదాబేగం, బెంగళూరుకు చెందిన అబ్దుల్ అరెస్ట్ గా గుర్తించారు. దీంతో వీరిద్దరిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా విజయవాడ టెర్రర్ (Vijayawada Terror) లింక్ లో కొత్త విషయాలు బయటికొచ్చాయి.
ఏడాది క్రితం భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్న సైదా బేగం.. 42 మందితో టెర్రర్ గ్రూపును ఏర్పాటు చేసి పోస్టింగ్స్ చేస్తుందని పోలీసులు తేల్చారు. పోలీసుల దర్యాప్తు ప్రకారం.. ఆమె రాత్రి సమయాల్లో సోషల్ మీడియాలో టెర్రర్ పోస్టింగ్ లు చేస్తుంది. దీని కోసం సైదా బేగం ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేసి యువతను టెర్రర్ వైపు మళ్లిస్తుంది.కాగా, అరెస్టయిన వారు అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ అనే పేరుతో ఒక రహస్య సంస్థను ఏర్పాటు చేసినట్లు విచారణలో వెల్లడైంది. స్థానిక యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడం, వారిని రాడికలైజ్ చేయడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశ్యం. సోషల్ మీడియా వేదికగా ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తూ, యువతలో మతపరమైన ఉన్మాదాన్ని నింపేందుకు వీరు ప్రయత్నించారు. ముఖ్యంగా భారత జాతీయ పతాకం స్థానంలో ఐసిస్ పతాకాన్ని ఉంచాలంటూ వీరు చేసిన ప్రచారం తీవ్ర దుమారం రేపుతోంది.

