కలం, వెబ్డెస్క్: తమిళనాడు సీఎం విజయ్ (Vijay)తో తన భేటీని రాజకీయం చేస్తూ, రాష్ట్రంలోని నేరాలను ప్రస్తావిస్తూ ఒక జర్నలిస్టు చేసిన విమర్శలపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, నటి ఖుష్బూ (Khushbu) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు జర్నలిస్టు ‘సెలెక్టివ్ అమ్నేషియా’తో బాధపడుతున్నాడని, అతనికి కేవలం సీఎం విజయ్తో దిగిన ఫోటో మాత్రమే కనిపించిందని, కానీ తాను మంత్రి రాజ్మోహన్తో కలిసి ఉన్న ఫోటోను మాత్రం ఉద్దేశపూర్వకంగానే విస్మరించాడని మండిపడ్డారు. తాను తమిళనాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, అలాగే టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షురాలిగా ఆ హోదాలోనే సీఎంను మర్యాదపూర్వకంగా కలిశానని స్పష్టం చేశారు. ఒక రాజకీయ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ, పరస్పర ప్రయోజనాల కోసం బతికే ఇలాంటి వ్యక్తులకు.. సీఎంతో తనకు ఉన్న ఆత్మీయ బంధం, వాస్తవాలు కనిపించకపోవడంలో ఆశ్చర్యం లేదని ఆమె ఎద్దేవా చేశారు.
తాను ఇతరులను కలవకూడదని ఏ రూల్ బుక్లో రాసి ఉందో చెప్పాలని ఖుష్బూ (Khushbu) ప్రశ్నించారు. 2021లో అప్పటి ముఖ్యమంత్రిని కలవడానికి ముందు వరుసలో వెళ్లింది మీరే కదా అంటూ సదరు జర్నలిస్టును నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో తమిళనాడులో శాంతిభద్రతలు అత్యంత ఘోరంగా క్షీణించినప్పుడు, అప్పటి సీఎం సినీ ప్రముఖులను కలిస్తే ఎందుకు ప్రశ్నించలేదని ఆమె నిలదీశారు. సమాజంలో పిల్లలు, బాలికలు, మహిళలు, ఏ మానవుడిపై అయినా అఘాయిత్యాలు, అన్యాయాలు జరిగినప్పుడు తాను ఎల్లప్పుడూ బాధితుల పక్షాన నిలబడి పోరాడుతూనే ఉన్నానని ఖుష్బూ స్పష్టం చేశారు.
Read Also: బాలికపై అత్యాచారం.. ప్రెస్మీట్లో నవ్వుకున్న పోలీసులపై వేటు

