కలం, నేషనల్ డెస్క్: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలన్నీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నా డీలిమిటేషన్ బిల్లును మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Kharge) నివాసంలో బుధవారం మధ్యాహ్నం రెండు గంటల పాటు సమావేశమైన ఇండియా కూటమి పార్టీల నేతలు ఈ రెండు బిల్లులపై లోతుగా చర్చించాయి. చట్టసభల్లో మహిళలకు 33.33% రిజర్వేషన్ కల్పించే అంశంలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని, వెంటనే అమలు చేయాలన్నదే కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీల అభిప్రాయమని మీడియాకు ఖర్గే వివరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్టీలన్నీ ఎప్పుడూ మద్దతుగానే ఉన్నాయని, ఇప్పుడు సైతం అదే అభిప్రాయంతో ఉన్నాయన్నారు. కానీ డీలిమిటేషన్ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి మాత్రం సహకార సమాఖ్య స్ఫూర్తిని ఉల్లంఘించడమే కాక రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నదన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో మూడు రోజుల పాటు జరిగే సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు చర్చకు వస్తే దానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఖర్గే వివరించారు.

