కలం, వెబ్ డెస్క్: తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరమైన మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? లేదా? అన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. 10 మంది ఎమ్మెల్యేలు తక్కువ పడ్డారు. దీంతో విజయ్ మద్దతు కూడగట్టుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
ఆ కాంగ్రెస్ నేత మంత్రాంగం
విజయ్ కి ఎట్టకేలకు కమ్యూనిస్టులు మద్దతు పలికారు. కమ్యూనిస్టులు మద్దతు ఇవ్వడం వెనుక కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీల అధినేతలతో ఆయన మాట్లాడినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. శుక్రవారం సాయంత్రం మరోసారి గవర్నర్ను కలవనున్న నటుడు విజయ్, ప్రభుత్వ ఏర్పాటు అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే బలాబలాల సమీకరణంపై స్పష్టత రావాల్సి ఉండటంతో ఈ సమావేశంపై ఆసక్తి నెలకొంది. వీసీకే, సీపీఎం, సీపీఐ పార్టీల మద్దతు విజయ్కు లభిస్తే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో అంచనా వేస్తున్నారు.

