కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) మున్సిపల్ కార్పొరేషన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.196 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించింది. బుధవారం జరిగిన కార్పొరేషన్ సమావేశంలో నగర మేయర్ పూనుకొల్లు నీరజ (Punukollu Neeraja) అధ్యక్షతన ఈ బడ్జెట్ను సభకు సమర్పించారు. నగరపాలక సంస్థ పరిపాలన అధికారి సిహెచ్. శ్రీనివాస్ బడ్జెట్ అంచనాలను సభ్యులకు వివరించారు. బడ్జెట్లో వివిధ ఖర్చులకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. బడ్జెట్ ప్రకారం, ఛార్జీల రూపంలో రూ.63.44 కోట్లు, నిర్వహణ ఖర్చుల కోసం రూ.18.03 కోట్లు, విలీన గ్రామాల అభివృద్ధి, ప్రజల అవసరాల కోసం రూ.16.01 కోట్లు కేటాయించారు.
అదేవిధంగా డిపాజిట్లు, అడ్వాన్స్లు, రుణాల కింద రూ.7.90 కోట్లు, క్యాపిటల్ ప్రాజెక్ట్ ఫండ్స్ కోసం రూ.91.02 కోట్లు అంచనా వేశారు. ఇక ఆదాయ వనరుల విషయానికి వస్తే, పన్నుల ద్వారా రూ.50.43 కోట్లు, పన్నేతర వనరుల ద్వారా రూ.96.94 కోట్లు, డిపాజిట్లు, అడ్వాన్స్ల రూపంలో రూ.7.90 కోట్లు సమకూరే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. మొత్తం మీద రూ.104.84 కోట్ల ఆదాయం వచ్చే అవకాశముందని బడ్జెట్లో పేర్కొన్నారు.

