కలం, వెబ్ డెస్క్: దేశంలో నక్సలిజం నిర్మూలన (eradication of Naxalism)పై సోమవారం లోక్ సభలో కీలక చర్చ జరుగనుంది. మావోయిస్టు ముక్త భారత్ కు పెట్టిన డెడ్లైన్ మంగళవారం (మార్చి 31)తో ముగియనుండటంతో ఈ లోక్ సభలో చర్చపై ఆసక్తి నెలకొంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ (Operation Kagar) అన్ని రాష్ట్రాల్లో దూసుకుపోతుంది. ఎక్కడికక్కడ మావోయిస్టులను కేంద్ర భద్రతా బలగాలు చంపేశాయి. ఛత్తీస్ గఢ్ అడవులు సహా దేశంలోని అన్ని అడవులు ఎన్కౌంటర్ల మోతతో దద్దరిల్లాయి. భారీగా మావోయిస్టులను కేంద్ర బలగాలు మట్టుబెట్టాయి. మరికొందరిని తీవ్రంగా గాయపరిచాయి. ఆపరేషన్ కగార్ పిలుపుతో కేంద్ర బలగాలు అదునుచూసి దూసుకువెళ్తున్నాయి. వ్యూహాత్మకంగా ఎక్కడికక్కడ మావోయిస్టులను హతమార్చుతున్నారు. రోజుల తరబడి వెంటాడి చంపడంతో మావోయిస్టులు బయపడి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. మరోకొంతమంది నీళ్లు దొరకక, తిండి లేక ఆకలికి తట్టుకోలేక అలసి పోయి అడవుల్లో భరించలేని బాధతో ఇక చేసేదేమిలేక పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఎన్కౌంటర్లతో అగ్రనేతల లొంగుబాటుతో మావోయిస్టు ఉద్యమం ముగింపు దశకు చేరుకుంది. ఈ తరుణంలో నక్షలిజంపై సోమవారం రూల్ 193 కింద లోక్ సభలో స్వల్పకాలిక చర్చ జరుగనుంది. టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే చర్చను ప్రారంభించనున్నారు.
ఈ ఏడాదిలోనే దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో మావోయిస్టుల లొంగుబాట్లు జరిగాయి. సాయుధ దళాల మోహరింపు, ఇంటెలిజెన్స్ ఆపేరేషన్స్ లాంటి చర్యలతో మావోయిస్టు అగ్రనేతలు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఇలా లొంగిపోయిన వారు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయాన్ని సైతం ప్రకటించాయి. మావోయిస్టు ప్రభావం ఉన్న 9 రాష్ట్రాల్లోని 38 జిల్లాల్లో ఇప్పటికే ఆపరేషన్ కగార్ దాదాపు ముగిసింది. తెలంగాణ, ఆంద్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, బీహార్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రలో నక్సలిజం నిర్మూలనకు ఏం చేశారనే దానిపై లోక్ సభలో చర్చ జరుగనుంది.

