కలం, వెబ్డెస్క్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కీసర (Keesara) పోలీస్ స్టేషన్లో ఎస్సై లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB)కి చిక్కిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్థానికులు స్టేషన్ ముందు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కీసర, బోగాపురానికి చెందిన ప్రజలు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. కీసర సీఐ ఆంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి పలు కేసుల్లో తమను వేధించారని స్థానికులు చెప్తున్నారు.
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా మంది దగ్గర సీఐ, ఎస్సై లంచాలు తీసుకున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. తాజాగా ఓ స్టేషన్ బెయిల్ విషయంలో సీఐ ఆంజనేయులు రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. ఈ మొత్తంలో రూ.5 లక్షలను ఎస్సై జ్ఞానేందర్ రెడ్డి బాధితుడి నుంచి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకొని సీఐ, ఎస్సైలను అదుపులోకి తీసుకున్నారు. కీసర పోలీస్ స్టేషన్తో పాటు వీరిద్దరి ఇండ్లల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

