కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ (MLC Naveen Kumar) స్పందించారు. ఎన్నికల సమయంలో తాను పేర్కొన్న చట్టబద్ధమైన ఆస్తులు తప్ప.. ఇంకా ఎక్కడా లేవని స్పష్టం చేశారు. రికార్డులతో సహా నిరూపించాలని ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. సిద్ధిపేట జిల్లాలో తనకు భూములున్నాయని చెప్పారని, తనకు అక్కడ ఎలాంటి ఆస్తిపాస్తులు లేవన్నారు.
తాను 2019, 2023 సంవత్సరాల్లో వరుసగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యానని.. అఫిడవిట్లో స్పష్టంగా వెల్లడించినట్లు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ తెలిపారు. తన పేరిట ఉన్న ఆస్తుల్లో ఎక్కువ శాతం 2014కి ముందే అప్పటి చట్టాలు, నిబంధనల ప్రకారం కొనుగోలు చేశానని వివరించారు. తన తండ్రి కొండల్ రావు పేరిట భూములున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయాలు పూర్తిగా అబద్ధమన్నారు. తన కుటుంబానికి 22 ఏ నిషేధిత భూముల అంశంతో ఎలాంటి సంబంధం లేదన్నారు.
దాచాల్సిన అవసరం లేదు..
సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో తన కుటుంబానికి ఉన్న భూములకు సంబంధించి అన్ని రకాల రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయని ఎమ్మెల్సీ నవీన్ రావు స్పష్టం చేశారు. సుదీర్ఘ ప్రజా జీవితంలో ఉన్న తాను ఆస్తిపాస్తులను దాచి ఉంచాల్సిన అవసరం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తనపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలన్నారు. లేకపోతే, సంబంధిత రికార్డులను వెరిఫై చేసి మరోసారి స్పష్టత ఇవ్వాలని సూచించారు.

