కలం, వెబ్డెస్క్: ఉత్తరాఖాండ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ కేదార్నాథ్ (Kedarnath) ఆలయ ద్వారాలు నేడు తెరుచుకున్నాయి. ఆరు నెలల విరామం తర్వాత ఈ రోజు ఉదయం నుంచి భక్తులకు కేదార్నాథ్ దర్శనం మొదలైంది. ఆలయ సముదాయం అద్భుతమైన రంగులు, పూలతో అలంకరించబడింది. దర్శనానికి వచ్చన భక్తులతో హిమాలయ పర్వత శ్రేణులు హరహర మహాదేవ్ నినాదాలతో మార్మోగుతున్నాయి. యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ అనే నాలుగు పుణ్య క్షేత్రాల సందర్శననే చార్ధామ్ (Char Dham) అంటారు. అటువంటి చార్ధామ్ యాత్ర కోసం 14.5 లక్షల మందికిపైగా భక్తులు నమోదు చేసుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఉత్తరాఖాండ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ కేదార్నాథ్ మందిర్ అనేది శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. ఈ దేవాలయం మందాకిని నదికి సమీపంలో గర్వ్హాల్ హిమాలయ శ్రేణిలో ఉంది. అయితే ఈ దేవాలయం ఆరునెలల పాటు మూసి ఉంటుంది. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా, ఏప్రిల్, నవంబర్ మధ్య మాత్రమే సాధారణ ప్రజలకు తెరిచి ఉంటుంది. నేడు ఆలయ ద్వారాలు తెరుచుకోగా, ఈనెల 25 నుంచి కేదార్కు నిత్య పూజలు మొదలవుతాయి.

