కలం, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ నోటీసు (CBI Notice)లు ఇవ్వడంపై జాగృతి చీఫ్ కవిత (Kavitha) స్పందించారు. ప్రస్తుతం తన లీగల్ టీంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. దీనిపై చట్టపరంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతిమంగా సత్యమే గెలుస్తుందన్న నమ్మకం తనకుందని కవిత అన్నారు. న్యాయ వ్యవస్థకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని స్పష్టం చేశారు. సీబీఐ నుంచి ఈరోజు మధ్యాహ్నం సుమారు 12:30 గంటలకు తనకు ఒక నోటీసు అందినట్లు చెప్పారు. ఈ నెల 16వ తేదీన హైకోర్టులో దాఖలు చేయనున్న పిటిషన్కు సంబంధించి ఈ నోటీసు ద్వారా సమాచారం అందించినట్లు వెల్లడించారు.
దర్యాప్తు సంస్థలు ఉన్నత న్యాయస్థానాల్లో పిటిషన్ దాఖలు చేసినప్పుడు నోటీసులు జారీ చేయడం అనేది చట్టపరమైన ప్రక్రియ అని, కావున దీన్ని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దని కవిత అన్నారు. న్యాయ వ్యవస్థకు భంగం కలిగించేలా ప్రచారం చేయవద్దని కోరారు.

