విచార‌ణ‌కు ఎందుకు భ‌య‌ప‌డుతున్నావ్.. కేటీఆర్‌కు క‌విత సూటి ప్ర‌శ్న‌

క‌లం, వెబ్ డెస్క్‌: ఫోన్ ట్యాపింగ్‌లో (Phone Tapping) ఏ త‌ప్పూ చేయ‌క‌పోతే విచార‌ణ ఎదుర్కొనేందుకు ఎందుకు భ‌య‌ప‌డుతున్నార‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను క‌విత (Kavitha) నిల‌దీశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో మాజీ సీఎం కేసీఆర్‌కు (KCR) సిట్ విచారించిన సంద‌ర్భంగా క‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను ఏ తప్పు చేయకపోయినా ఓ కేసుకు సంబంధించి ఈడీ, సీబీఐ విచారణకు వెళ్లాన‌ని క‌విత అన్నారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిస్తే కూడా వెళ్ల‌డానికి సిద్ధంగానే ఉన్నాన‌ని క‌విత తెలిపారు. కానీ, కేటీఆర్ మాత్రం విచార‌ణ‌ల‌కు ఎందుకు వెన‌క‌డుగు వేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. చ‌ట్ట‌ప‌రంగా విచార‌ణ జ‌రుగుతుంటే ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు కేసీఆర్ సీఎంగా ఉన్నారని, ఈ కేసులో కేసీఆర్‌ను అసలు విచారణకే పిలవద్ద‌ని అనడం స‌రికాద‌ని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. ఇలాంటి రాచరిక పోకడల ఆలోచనలు మారకపోతే బీఆర్ఎస్‌ను ఎవ‌రూ కాపాడలేర‌న్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు సాగదీయకుండా విచారణను తుది దశకు తీసుకురావాల‌ని క‌విత డిమాండ్ చేశారు. అదే విధంగా కేసీఆర్‌ను ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిచే పరిస్థితి ఎందుకు వచ్చిందో బీఆర్ఎస్ ఆలోచించుకోవాల‌న్నారు. ఓ గుంటనక్కతో కాంగ్రెస్ ప్రభుత్వం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంద‌ని, అందుకే ఈ కేసులో విచారణ పూర్తి చేస్తారన్న‌ నమ్మకం త‌న‌కు లేద‌ని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల కోసమే కొన్ని రోజులు ఈ కేసును అటు, ఇటు తిప్పుతున్నార‌ని విమ‌ర్శించారు. నిజంగా కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే రెండేళ్లుగా ఎందుకు కేసు ప‌రిష్కారం కాలేద‌ని ప్ర‌శ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ప‌రిస్థితి సైకిల్ స్టాండ్ వేసి తొక్కినట్లు ఉంద‌ని కామెంట్ చేశారు. ఈ కేసులో విచార‌ణ‌ పారదర్శకంగా జ‌ర‌గాల‌ని, విచారణకు ఎవరిని పిలిచినా వెళ్లాల్సిందేన‌ని, చట్టాలకు ఎవరు అతీతం కాద‌ని క‌విత (Kavitha) స్ప‌ష్టం చేశారు.

 Read Also: గెలిచే అభ్యర్థులకే బీ-ఫామ్స్ : సీఎం రేవంత్​ రెడ్డి

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>