కలం, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికలను (Municipal Elections) సవాలుగా తీసుకోవాలని, స్థానిక లీడర్ల మొదలు మంత్రుల వరకు కష్టపడి పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. పార్టీ సింబల్తో జరుగుతున్న ఎన్నికలైనందున ఇవి పార్టీకి చాలా ప్రతిష్టాత్మకమని నొక్కిచెప్పారు. పోటీచేస్తున్న అభ్యర్థుల్ని గెలిపించుకోవాల్సిన అవసరాన్ని కూడా వివరించారు. విదేశీ పర్యటనను ముగించుకుని తెల్లవారుజామున నగరానికి చేరుకున్న సీఎం… జూమ్ మీటింగ్లో పీసీసీ నేతలు, మంత్రులతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం తీరును, ఇకపైన ఉధృతం చేయాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు. ఇప్పటికే చాలా మంది ఆశావహులు నామినేషన్లు దాఖలు చేశారని, రెబల్స్ బెడద లేకుండా చూసుకోవాలన్నారు. పోటీ నుంచి తప్పించడంపై అవసరమైన చర్యలను స్థానిక నేతలు చూసుకోవాలని సీఎం సూచించారు.
నామినేషన్ల ఉపసంహరణకు గడువు దగ్గర పడుతున్నందున పార్టీ ఎవరిని ఖరారు చేస్తుందో ఆ అభ్యర్థికి మాత్రమే బీ-ఫామ్ అందజేయాలన్నారు. బీ-ఫామ్స్ ను అందజేసే బాధ్యత డీసీసీలదేనని అన్నారు. పార్టీ కోసం కష్టపడి చిత్తశుద్ధితో పనిచేసేవారికి, గెలిచే అవకాశాలున్నవారికే బీ-ఫామ్ ఇవ్వాలని స్పష్టం చేశారు. అభ్యర్థుల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా మంత్రుల మొదలు స్థానిక ఎమ్మెల్యే వరకు ఉన్నదన్నారు. టికెట్ ఇస్తామని సిఫారసు చేసిన నేతలకు ఆ అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత ఎక్కువగా ఉంటుందన్నారు. పోటీకి సిద్ధపడి టికెట్ రాని నేతలను ప్రత్యామ్నాయంగా పార్టీ కార్పొరేషన్ లాంటి ఇతర పదవులిచ్చి అవకాశం కల్పిస్తుందని సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) భరోసా ఇచ్చారు. ప్రతీ అభ్యర్థి స్థానికంగా లోకల్ మేనిఫెస్టోను రెడీ చేసుకోవాలని, ఐదేండ్ల కాలంలో ఏమేం అభివృద్ధి పనులు చేయనున్నదీ ప్రజలకు వివరించాలన్నారు.
Read Also: సింహం గుర్తుకు ఫుల్ డిమాండ్.. రెబల్స్ అంతా అటువైపే మొగ్గు
Follow Us On : WhatsApp


