కలం, మెదక్ బ్యూరో: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఉచిత విద్యుత్, వైద్యం ఇవ్వకపోతే తెల్లపూర్ వద్ద తనను కట్టేసి రాళ్లతో కొట్టండని అన్నారు. సంగారెడ్డిలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా పటాన్చెరులో టీఆర్ఎస్ జెండా ఎగురవేశారు.
అనంతరం కవిత మాట్లాడుతూ.. మంత్రి దామోదర బావమరిది సింగూర్ ప్రాజెక్టులో 200 ఎకరాల భూ కబ్జా చేస్తే ఎవరూ ప్రశ్నించడం లేదన్నారు. ప్రతిపక్ష నాయకులు ఎందుకు దీనిపై మాట్లాడటం లేదని ఫైర్ అయ్యారు. సంగారెడ్డిలో రాజకీయం భలే ఉంటుందని.. జగ్గారెడ్డి, రఘునందన్ రావు, దామోదర రాజనర్సింహ, హరీశ్ రావు లాంటి నాయకులు వివిధ పార్టీల్లో ఉంటారు కానీ.. అందరూ కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
జహీరాబాద్ లో బులెట్ ట్రైన్ కోసం భూ సేకరణ ప్రారంభం చేశారు.. కానీ ప్రాజెక్టు డీపీఆర్ (ప్రాజెక్టు పూర్తి వివరణ) మార్చడంతో బులెట్ ట్రైన్ రాలేదని.. ఈ విషయంపై ఎంపీ రఘునందన్ రావు నోటికి ఎందుకు తాళం పడింది అని ప్రశ్నించారు. హరీష్ రావు బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ మంత్రిగా ఉండి సింగూరు ప్రాజెక్టు కుంగుతున్నా ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. నీళ్ల కోసం ఆనాడు ఆంధ్రా వాళ్ళని తిట్టామని.. మరి తెలంగాణ వచ్చాక హరీశ్ రావు ఎందుకు రిపేర్ చేయలేదని కవిత (Kavitha) ప్రశ్నించారు. సింగూర్ ప్రాజెక్టు 2016-18లో మొత్తం ఎండిపోయిందని, జిల్లా మంత్రిగా అయినా రిపేర్ ఎందుకు చేయలేదన్నారు.
Read Also: తగ్గిన సాగు.. రాష్ట్రంలో కూరగాయల షార్టేజ్ ముప్పు!
Follow Us On: X(Twitter)

