కలం, వెబ్ డెస్క్: సమాజంలో బాధ్యతాయుతమైన ప్రకటనలు అనేవి ఆప్షనల్ కాదని, అవి ఒక నిబంధనగా మారాలని జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత (Kavitha) పిలుపునిచ్చారు. తెలంగాణకు చెందిన రక్షా హైజీన్ సంస్థ పీరియడ్స్ పై ఉన్న అపోహలను తొలగించడంలో ముందుండటం గర్వకారణమని కవిత ప్రశంసించారు. ఈ మేరకు ఆ సంస్థ సీఈవో, ఫౌండర్, కో ఫౌండర్ మాట్లాడిన ఓ వీడియోను కవిత ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఈ సందర్భంగా శానిటరీ ప్యాడ్ల ప్రకటనలు పీరియడ్స్ పట్ల అవగాహన కల్పించేలా ఉండాలి కానీ, ఆ సమయంలో మహిళలు ఎదుర్కొనే వాస్తవ ఇబ్బందులను దాచిపెట్టేలా ఉండకూడదన్నారు. గతంలో ఫెయిర్నెస్ క్రీముల విషయంలో మార్పు తీసుకురాగలిగినప్పుడు, పీరియడ్స్ ప్రకటనల్లో కూడా వాస్తవాలను ప్రతిబింబించేలా మార్పు కోరడంలో తప్పులేదని ఆమె స్పష్టం చేశారు. ప్రకటనల్లోని విజువల్స్ తమ నినాదాల కంటే బలంగా ప్రజల్లోకి వెళ్తాయని, అందుకే అవి వాస్తవానికి దగ్గరగా ఉండాలని కోరారు. రక్షా హైజీన్ సంస్థ పీరియడ్స్కి సంబంధించి సమాజంలో నెలకొన్న అపోహలను తొలగించేందుకు తాము చేపట్టిన ఉద్యమానికి కేవలం ఆరంభం మాత్రమేనని కవిత పేర్కొన్నారు. మహిళల ఆరోగ్యం, పరిశుభ్రత విషయంలో వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె గుర్తు చేశారు.

