కలం, వెబ్ డెస్క్: సూర్యాపేట(Suryapet)లో సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ నేత చింతలపాటి మధు హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ నర్సింహ వెల్లడించారు. అరెస్టైన వారిలో మిద్దె జీవన్, చింతా సైదులు, మేదరి ప్రసాద్, మిద్దె ఆనంద్, కక్కిరేణి భరత్ చంద్ ఉన్నట్లు తెలిపారు. ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2007లో జరిగిన కాంగ్రెస్ నేత మిద్దె రవీందర్ హత్యకు ప్రతీకారంగానే చింతలపాటి మధును హత్య చేసినట్లు విచారణలో తేలింది. తండ్రి మిద్దె రవీందర్ హత్యను మరిచిపోలేకపోయిన అతని కుమారుడు మిద్దె జీవన్ ప్రతీకారంతో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.
సూర్యాపేట మండలం యర్కారం గ్రామంలో జరిగిన ఈ హత్య రాజకీయ కక్షలను మరోసారి రగిలించింది. చింతలపాటి మధును దుండగులు అత్యంత దారుణంగా హత్య చేసి, శరీరాన్ని ముక్కలుగా నరికి బస్తాలో కుక్కి పడేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. గతంలో జరిగిన ఓ హత్య కేసులో మధు కీలక సాక్షిగా ఉన్నట్లు సమాచారం. ఆ కేసు విచారణ ముగిసే దశలో ఉండటంతోనే ముందస్తు పథకం ప్రకారం అతడిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
హత్య ఘటన అనంతరం యర్కారం గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు దర్యాప్తులో వెల్లడవుతాయని ఎస్పీ నర్సింహ తెలిపారు.

