కలం, జోగులాంబ గద్వాల: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు హాజరు శాతంపై ప్రత్యేక దృష్టి సారించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ (Gadwal Collector) రిజ్వాన్ బాషా షేక్ (Rizwan Basha Shaik) సూచించారు. మంగళవారం గద్వాల మండలంలోని చెనుగొనిపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి పాఠశాల ఆవరణ, తరగతి గదులు, పారిశుద్ధ్య పనులు, మౌలిక సదుపాయాలను ఆయన పరిశీలించారు.
అనంతరం పాఠశాల సిబ్బందితో మాట్లాడి విద్యార్థుల హాజరు, విద్యాబోధన, మధ్యాహ్న భోజనం, యూనిఫాంల పంపిణీ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాలుగో తరగతి విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి అభ్యాసన సామర్థ్యాన్ని పరీక్షించారు. అలాగే విద్యార్థులతో మధ్యాహ్న భోజనం, యూనిఫాంలు, ఇతర మౌలిక సదుపాయాలు సక్రమంగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యాబోధన అందించి అభ్యసన సామర్థ్యాలను మరింత మెరుగుపరచాలని సూచించారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజూ తప్పనిసరిగా పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని అన్నారు. పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వంద శాతం ఉండేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
విద్యార్థులకు ప్రతిరోజూ నిర్ణీత సమయానికి నాణ్యమైన, పరిశుభ్రమైన మధ్యాహ్న భోజనం అందించాలని, ప్రతి విద్యార్థికి ప్రభుత్వం అందించే యూనిఫాంలు, ఇతర సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక శ్రద్ధతో బోధన అందించాలని సూచించారు.
పాఠశాల ఆవరణ, తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగు నీటి ప్రాంతాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, పరిశుభ్రత, చదువుపై ఆసక్తి పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. తల్లిదండ్రులతో నిరంతరం సమన్వయం కొనసాగించి విద్యార్థుల హాజరు, విద్యా ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
ఎస్ఐఆర్ (SIR) కార్యక్రమంలో భాగంగా ఓటరు ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా వంద శాతం డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన SIR పనులను పరిశీలించి, బీఎల్ఓలు, సంబంధిత అధికారులతో మాట్లాడి ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ, డిజిటైజేషన్, ఇంటింటి సర్వే పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మిస్ కాకుండా ప్రతి అర్హుడి వివరాలను నమోదు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టి ఎలాంటి లోపాలు, నిర్లక్ష్యానికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బీఎల్ఓలు పూర్తి బాధ్యతతో వారి నుంచి సరైన సమాచారాన్ని సేకరించి ఫారాలను పూర్తిగా నింపి వెంటనే డిజిటైజేషన్ కోసం అప్లోడ్ చేయాలని సూచించారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ విజయవంతానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు సానుకూల సహకారం అందించాలని, అర్హులైన ఒక్క ఓటరు కూడా మిస్ కాకుండా బీఎల్ఓలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ హరికృష్ణ, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, బీఎల్ఓలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

