కలం, వెబ్ డెస్క్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపుల ఆరోపణలపై ఉదయ్ కృష్ణా రెడ్డి (Uday Krishna Reddy) స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలని, తాను ఎక్కడికీ పారిపోలేదని స్పష్టం చేశారు. తన నానమ్మ అనారోగ్యంతో ఉండటంతో స్వగ్రామమైన ప్రకాశం జిల్లాలోని ఊళ్లపాలెంకు వచ్చానని తెలిపారు. దీనిని తప్పుగా ప్రచారం చేస్తూ తాను పరారీలో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఉదయ్ కృష్ణ స్పష్టం చేశారు.
న్యాయవ్యవస్థ, పోలీస్ వ్యవస్థలపై తనకు పూర్తి నమ్మకం ఉందని, అందుకే విచారణకు పూర్తిగా సహకరిస్తాన్నారు. హైదరాబాద్ లో ఉన్న రెండు చిరునామాలు తాత్కాలికమైనవని.. తన శాశ్వత చిరునామా అయిన ఉళ్లపాలెంకు ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు రాలేదని ఉదయ్ కృష్ణారెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నందునా ఎక్కువ వివరాలు వెల్లడించడం సరికాదని తెలిపారు. తాను నిర్దోషినని, కోర్టులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

