కలం, కరీంనగర్: కరీంనగర్ నగరంలో చిరు వ్యాపారులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే దిశగా నగరపాలక సంస్థ (Karimnagar Municipal Corporation) ఆధ్వర్యంలో “చికెన్ అండ్ ఎగ్ స్టాల్స్” (Chicken – Egg Stalls) పంపిణీ కార్యక్రమం మున్సిపల్ ఆవరణలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas), బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు హాజరై 10 మంది లబ్ధిదారులకు ఈ ఆధునిక స్టాల్స్ ను పంపిణీ చేశారు.
పౌష్టికాహారంపై అవగాహన..
మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ)జాతీయ గుడ్డు సమన్వయ కమిటీ నెక్ సంయుక్త సహకారంతో ఈ ఆకర్షణీయమైన “చికెన్ అండ్ ఎగ్ స్టాల్స్” లను రూపొందించడం జరిగింది. ప్రజల్లో పౌష్టికాహారం పట్ల అవగాహన పెంచేందుకు స్టాల్స్ పై ప్రత్యేకంగా “ప్రతి రోజు రెండు కోడి గుడ్లు తినండి – రోగాలకు దూరంగా ఉండండి”, “వంద శాతం కల్తీలేని అధిక పోషక విలువలు కలిగిన కోడి గుడ్డు” వంటి సందేశాలను పొందుపరిచారు. అలాగే జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందిన “సండే హో యా మండే.. రోజ్ ఖావో అండే” నినాదాన్ని కూడా స్టాల్ పై ముద్రించారు.
పరిశుభ్రమైన వాతావరణంలో ఆహార విక్రయాలు..
ఈ స్టాల్స్ ద్వారా చికెన్, కోడిగుడ్లతో చేసిన వివిధ రకాల వంటకాలను (ఆమ్లెట్, చికెన్ కబాబ్, చికెన్ ఫ్రైడ్ రైస్ తదితర) పరిశుభ్రమైన వాతావరణంలో విక్రయించేలా స్టాల్స్ కు ఆకర్షణీయమైన డిజైన్, మెనూ బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పంపిణీ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సువార్త కార్పొరేటర్లు వాసాల రమేష్, వేముల చంద్రశేఖర్, తాటి ప్రభావతి, రామన్, సౌగాని కొమురయ్య, భారీ జితేందర్, సరిల్ల ప్రసాద్, నలువాల రవీందర్, వరాల నర్సింగం, బుచ్చిరెడ్డి, మెప్మా అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

