కలం, జోగులాంబ గద్వాల: గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా పకడ్బందీగా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మధు మోహన్ (Additional Collector Madhu Mohan) అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం నదీ అగ్రహారం, బీచుపల్లి (Beechupally) వద్ద గల గణేష్ నిమజ్జన ప్రాంతాలను అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) నర్సింగరావుతో కలిసి ఆయన పరిశీలించారు. నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్, లైటింగ్, రహదారులు, బారికేడింగ్, పార్కింగ్, భద్రతా చర్యలను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.
నదీ తీర ప్రాంతాల్లో భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అవసరమైన రక్షణ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల రాకపోకలు, పార్కింగ్పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా మున్సిపల్ కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పోలీస్ శాఖతో పాటు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఏర్పాటును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, నిమజ్జన కార్యక్రమానికి ముందే అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Also Read : 823 రోజులు మాత్రమే, వదిలిపెట్టం.. కేటీఆర్ ఆగ్రహం
Follow Us On : WhatsApp

