కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal ) జిల్లా కేంద్రంలోని మల్లన్నగుట్ట హరిహర క్షేత్రం అయ్యప్ప ఆలయ గురుస్వామి నవయుగ మూర్తికి నంది పురస్కారం లభించింది. హైదరాబాద్ లో మహా శాస్త సేవా సంఘం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షుడు లక్కడి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గురుస్వామి నవయుగ మూర్తిని శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు.
అదేవిధంగా నిర్మల్ నుంచి పాపహరేశ్వర ఆలయం వరకు సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మహా పాదయాత్రను విజయవంతం చేయడంతో పాటు, సుదీర్ఘకాలంగా ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమితి అధ్యక్షుడు లక్కడి జగన్మోహన్ రెడ్డి సేవలను గుర్తిస్తూ ఆయనను సైతం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త వినోద్, ఆలయ కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, నాయకులు గండ్రత్ రమేష్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

