కలం, కరీంనగర్ బ్యూరో: పారదర్శకమైన ఓటరు జాబితా రూప కల్పనే ధ్యేయంగా నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన సర్ సర్వేను పకడ్బందీగా పూర్తి చేయడానికి రాజకీయ పార్టీలు, నగర ప్రజలు సహకరించాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ (Praful Desai) పిలుపునిచ్చారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం నగరంలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం జరిగింది. సమగ్ర ఓటర్ సవరణ, పారదర్శకమైన ఓటర్ జాబితా, మరణించిన, నకిలీ ఓటర్లను జాబితా నుండి తొలగించడం తదితర అంశాలపై పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో చర్చించారు. పలు సూచనలు చేస్తూ నగర ప్రజలకు సంబంధిత విషయంపై అవగాహన కల్పించి సమగ్ర ఓటర్ సవరణ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని పార్టీల ప్రతినిధులకు సూచించారు.
ఈ సందర్బంగా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ… నగరపాలక సంస్థ పరిధిలోని సమగ్ర ఓటర్ జాబితా సవరణ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పారదర్శకమైన ఓటర్ జాబితా రూపొందించేలా డివిజన్ల వారీగా ప్రజలను అవగాహన పరిచి… ఓటరు సవరణ చేసుకునేలా చూడాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లను సరిచూసుకొని బీఎల్ఓల ద్వారా అవసరమైన సవరణలు చేసుకునేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో ఓటర్ల సవరణ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

