కలం, వెబ్ డెస్క్ : అన్నదాతలకు అందాల్సిన సబ్సిడీ ఎరువులను పక్కదారి పట్టిస్తే ఫెర్టిలైజర్ డీలర్ల లైసెన్స్ రద్దు చేస్తామని వ్యవసాయ, ఉద్యానవన శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) హెచ్చరించారు. అన్నదాతలను మోసం చేసే ఏ ఒక్క చర్యను కూటమి ప్రభుత్వం ఉపేక్షించబోదని వెల్లడించారు. సాగు సీజన్లో రాష్ట్రంలో కావాలనే కృత్రిమ ఎరువుల కొరతను సృష్టించి, బ్లాక్లో విక్రయాల ద్వారా సొమ్ము చేసుకునే అక్రమార్కుల ఆట కట్టించాలని అధికారుల్ని ఆదేశించారు.
ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫెర్టిలైజర్ డీలర్లు, ప్రైవేట్ గోదాములపై తక్షణమే ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో అక్రమార్కులతో చేతులు కలిపే అధికారులను కూడా వదిలిపెట్టమని హెచ్చరించారు. రైతులకు సాగు సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలన్న మంత్రి.. దీనికోసం ఇకపై ప్రతిరోజూ జిల్లాల వారీగా ఎరువుల అందుబాటు, నిల్వలపై (స్టాక్) ప్రత్యేకంగా మానిటరింగ్ చేసే వ్యవస్థను తీసుకొస్తున్నట్లు వివరించారు.

