కలం, కరీంనగర్ బ్యూరో: ఎస్సీ స్టడీ సర్కిల్లో అన్ని సౌకర్యాలు కల్పించి అధునాతనంగా తీర్చిదిద్దాలని కరీంనగర్ కలెక్టర్ (Karimnagar Collector) ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్ ను కలెక్టర్ చిత్రా మిశ్రా (Chitra Mishra) సందర్శించారు. గదులు కలియ తిరుగుతూ పరిసరాలు పరిశీలించారు. ప్రస్తుత వసతుల గురించి సోషల్ వెల్ఫేర్ ఇంచార్జి డిప్యూటీ డైరెక్టర్ తిరుపతిరావును అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు. పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు చదువుకునేలా రీడింగ్ రూమ్ సిద్ధం చేయాలని ఆదేశించారు. తాగునీరు మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హెచ్చరించారు.
స్టోర్ రూమ్లో ఉన్న వస్తువులను ఖాళీ చేయించాలని, వారంలోగా భవనానికి అవసరమైన మరమ్మత్తులు చేయించాలని టీజీడబ్ల్యూ ఐడీఎస్ అధికారులను ఆదేశించారు. ఆన్ లైన్ పరీక్ష నిర్వహించేలా కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టడీ సర్కిల్ ఉద్యోగులు ఉన్నారు.

