కలం, వెబ్ డెస్క్: మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ నటుడు, ఎంపీ కమల్ హాసన్ (Kamal Haasan) చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆయన నేరుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల ట్రంప్ భారత్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాక్తో యుద్ధం తానే ఆపానని ప్రకటించడం, భారత్ మీద టారిఫ్ విధించి బెదిరింపులకు పాల్పడటం. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని హుకుం జారీ చేయడంపై విమర్శలు వచ్చాయి. భారత సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించేలా ట్రంప్ వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
తాజాగా అమెరికా అధ్యక్షుడికి చురకలు అంటిస్తూ కమల్ హాసన్ ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు అంటూ ట్వీట్ మొదలు పెట్టారు కమల్ హాసన్(Kamal Haasan).. ‘మేము భారత ప్రజలం స్వేచ్ఛా, సార్వభౌమత్వం ఉన్న దేశానికి చెందినవాళ్లం. విదేశాల నుంచి వచ్చే ఆదేశాలను మేము ఇకపై అనుసరించే ప్రసక్తి లేదు. దయచేసి మీ పనిని మీరు చూసుకోండి. సార్వభౌమ దేశాల మధ్య పరస్పర గౌరవమే ప్రపంచశాంతికి పునాది. మీ దేశానికి, మీ ప్రజలకు శాంతి, అభివృద్ధి కలగాలని కోరుకుంటున్నాం. ఓ భారతీయుడిగా నేను గర్వపడుతున్నాను.’ అంటూ కమల్ హాసన్ ట్వీట్ చేశారు.

