కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన మార్పు చోటుచేసుకుంది. మక్కళ్ నీది మయ్యమ్ (MNM) అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ఈసారి ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. 2026 ఎన్నికల్లో తమ పార్టీ నేరుగా పోటీ చేయడం లేదని స్పష్టం చేసిన ఆయన, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమికి బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
సీట్ల పంపకాలు లేదా పార్టీ గుర్తు వంటి అంశాల కంటే మతవాద శక్తులను అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని కమల్ హాసన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పరిణామంతో తమిళనాడు ఎన్నికల చిత్రం ఒక్కసారిగా మారిపోయింది, కూటమి బలబలాలు ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి.

