కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై కల్వకుంట్ల కవిత (Kavitha) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పుడు మన ముందున్నది పాత కేసీఆర్ కాదని, పూర్తిగా మారిపోయిన ‘మర కేసీఆర్‘ అని ఆమె వ్యాఖ్యానించారు. ఒకప్పుడు మన బిడ్డల కోసం తపించిన కేసీఆర్, తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకు ఇలా మారిపోయారని ఆమె ప్రశ్నించారు. ఈ మధ్య కాలంలో కేసీఆర్ రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతున్నారని, ప్రజలే తప్పు చేశారనే స్థాయికి ఆయన వెళ్లడం సరికాదని ఆమె ఆక్షేపించారు. కేటీఆర్ వంటి వారికి విషయాలు తెలియక మాట్లాడుతున్నారనుకోవచ్చు కానీ, అనుభవం ఉన్న కేసీఆర్ ఇలా అనడం విచారకరమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం కర్కోటక పాలన సాగుతోందని విమర్శించిన కవిత (Kavitha), హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలగొడుతుంటే పాత కేసీఆర్ ఎక్కడికి పోయారని నిలదీశారు. కళ్లముందే అన్యాయం జరుగుతున్నా స్పందించని ఈ కేసీఆర్ మన మనిషి కాదని, ఆయన ఒక మర మనిషిగా మారిపోయారని ఎద్దేవా చేశారు. ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతోనే తాను కొత్త పార్టీని స్థాపించాల్సి వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. కేసీఆర్ మన పాత నాయకుడు కాదని, ఆయనలో మార్పు వచ్చిందని ప్రజలు గుర్తించాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Read Also: పార్టీ జెండా ఆవిష్కరించిన కల్వకుంట్ల కవిత
Follow Us On: Instagram

