కలం, వెబ్ డెస్క్: ఏపీలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) తీవ్ర విమర్శలు చేశారు. పండించిన పంటకు మద్దతు ధర లేక రైతులు రోదిస్తున్నా చంద్రబాబుకు చీమ కుట్టినట్టైనా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రాన్ని కొనుగోలు చేయమని చంద్రబాబు ఒత్తిడి చేయడని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక, పెట్టిన పెట్టుబడి రాక రైతులు అల్లాడుతున్నారని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నారని చెప్పారు. ఒక పక్క రైతులు గిట్టుబాటుధర లేక ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖామంత్రి ట్రైనింగ్ పేరుతో విదేశాలకు విహార యాత్రకు వెళ్లాడని ఆరోపించారు. సింగపూర్ వెళ్లిన మంత్రులందరూ ఏవిధంగా అవినీతికి పాల్పడాలనేదానికి శిక్షణ తీసుకుంటారా? అంటూ చురకలు అంటించారు.
అటు చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు (TJR Sudhakar Babu) ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూటమి ఎమ్మెల్యేలు బరితెగిస్తున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడిచి, రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారని ఆరోపించారు. మహిళలపై దాడులు చేసినా, వేధింపులు చేసినా, జనాలను కొట్టినా ఈ ప్రభుత్వం వారిని ఏమీ అనదని.. ఎలాంటి చర్యలు తీసుకోదని విమర్శించారు. ఇలాంటి దుష్ట నాయకులను ఈ ప్రభుత్వం ఎందుకు పెంచి పోషిస్తోంది? అని ప్రశ్నించారు. స్వయంగా ముఖ్యమంత్రే కక్ష సాధింపు రాజకీయాలకు తెరలేపినప్పుడు, తాను ప్రజలతో ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని అనే స్పృహ లేనప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు సైతం గూండాల్లా, రౌడీల్లా మారి ప్రజలను వేధిస్తున్నారని ఆయన (Kakani) మండిపడ్డారు.
Read Also: ఫుట్పాత్ల ఆక్రమణలను మేం తొలగించడం లేదు: హైడ్రా
Follow Us On : WhatsApp

