గుజరాత్ టైటాన్స్ మైనస్ పాయింట్ అదే!

కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 దగ్గర పడుతున్న నేపథ్యంలో జట్ల బలాబలాలపై సీనియర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) బౌలింగ్‌పై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బౌలింగ్ విషయంలో జీటీ మైనస్ పాయింట్ ఒకటేనని అన్నారు. గత సీజన్‌లో అద్భుతమైన బౌలింగ్ లైనప్ ఉన్నప్పటికీ, ఈసారి డెత్ ఓవర్లలో పరుగులు నియంత్రించే స్పెషలిస్ట్ బౌలర్ లేకపోవడం జట్టుకు బలహీనతగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది ప్రసిద్ధ్ కృష్ణ 25 వికెట్లతో పర్పుల్ క్యాప్ గెలవగా, సాయి కిషోర్ 19 వికెట్లు పడగొట్టడం విశేషం.

మొహమ్మద్ సిరాజ్, కాగిసో రబడా, రషీద్ ఖాన్ వంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ.. చివరి ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసే ప్లేయర్ టైటాన్స్‌లో కనిపించడం లేదని కైఫ్ పేర్కొన్నారు. సిరాజ్ కొత్త బంతితో మెరుస్తాడని, ప్రసిద్ధ్ కృష్ణ మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయగలడని ఆయన విశ్లేషించారు. అయితే గత సీజన్ చివరి మ్యాచుల్లో రబడా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ముగ్గురూ భారీగా పరుగులు సమర్పించుకున్న విషయాన్ని కైఫ్ గుర్తు చేశారు.

ముఖ్యంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత సీజన్ మ్యాచ్‌లో సిరాజ్, కృష్ణ ఎనిమిది ఓవర్లలో ఏకంగా 90 పరుగులు ఇచ్చారని, అది జట్టును ఎలిమినేటర్ రేసు నుండి దూరం చేసిందని కైఫ్ గుర్తు చేశారు. ప్రస్తుత జట్టులో ఇషాంత్ శర్మ, ల్యూక్ వుడ్ వంటి ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ, డెత్ బౌలింగ్ సమస్య అలాగే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ తమ మొదటి మ్యాచ్‌ను మార్చి 31న పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>