కలం, వెబ్ డెస్క్ : అఫ్గానిస్థాన్ (Afghanistan)లో పాకిస్థాన్ దళాలు జరిపిన వైమానిక దాడులు విషాదాన్ని నింపాయి. కాబుల్లోని ఒక ఆస్పత్రిని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దారుణ దాడిలో 400మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరో 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాంబుల దాడితో ఆస్పత్రి భవనం కుప్పకూలిపోవడంతో శిథిలాల కింద అనేకమంది చిక్కుకుపోయినట్లు అఫ్గాన్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. మృతుల్లో రోగులు, వైద్య సిబ్బందితో పాటు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ దాడులపై పాకిస్థాన్ భిన్నమైన వాదనను వినిపిస్తోంది. అఫ్గాన్ (Afghanistan) భూభాగంపై తాము ఎటువంటి వైమానిక దాడులు నిర్వహించలేదని పాక్ ప్రభుత్వం చెబుతోంది. క్షేత్రస్థాయిలో భారీ ప్రాణనష్టం జరిగిందని ఆధారాలు కనిపిస్తున్నప్పటికీ, ఈ ఘటనతో తమకు సంబంధం లేదని ఆ దేశం బుకాయిస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో, ఒక ఆస్పత్రిపై జరిగిన ఈ దాడి రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత ఉద్రిక్తం చేసేలా కనిపిస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

