సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా (CJI) జస్టిస్ సూర్యకాంత్(Justice Surya Kant) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన వేడుకలో భారత రాష్ట్రపతి ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఆయన ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం జస్టిస్ బీఆర్ గవాయ్ పదవీకాలం ముగించింది.
సూర్యకాంత్(Justice Surya Kant) హరియాణా రాష్ట్రానికి చెందిన తొలి ప్రధాన న్యాయమూర్తి కావడం గమనార్హం. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హరియాణాలోని హిస్సార్ జిల్లాలో జన్మించారు. సామాన్య కుటుంబంలో పెరిగిన ఆయన చిన్ననాటి నుంచే క్రమశిక్షణను అలవాటు చేసుకున్నారు. 1981లో డిగ్రీ పూర్తి చేసి, న్యాయరంగంపై ఆసక్తితో 1984లో రోహ్తక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు. అదే సంవత్సరం హిస్సార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా తన న్యాయ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయన పనితీరుతో 1985లో పంజాబ్, హరియాణా హైకోర్టుకు మారారు. అక్కడ ఆయన వాదనలు, న్యాయపరమైన అవగాహన న్యాయవర్గాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి.
న్యాయరంగంలో ఎదుగుదల
2001లో ఆయన సీనియర్ అడ్వొకేట్గా గుర్తింపు పొందారు. 2004 జనవరి 9న పంజాబ్, హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై కీలక తీర్పులతో ప్రజల దృష్టిని ఆకర్షించారు. 2018లో హిమాచల్ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా సేవలందించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన ఆయన, వివిధ రాజ్యాంగ ధర్మాసనాలు, క్రిమినల్, సివిల్, పర్యావరణ అంశాలపై అనేక ముఖ్య తీర్పుల్లో భాగమయ్యారు. న్యాయసూత్రాలపై ఆయనకున్న అవగాహన, సామాజిక న్యాయంపై ఉన్న కట్టుబాటు న్యాయరంగంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపునిచ్చాయి.
Read Also: స్మృతి మందాన పెళ్లి వాయిదా.. ఆఖరి నిమిషంలో..!
Follow Us on: Youtube


