కలం, వెబ్ డెస్క్: ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా.. సోనియా గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చారని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయానికి కారణం కాంగ్రెస్ కాదని.. సమైక్య పాలకులు అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడం వల్లే కేసీఆర్ సీఎం కాగలిగారు అనే విషయాన్ని హరీశ్ రావు గుర్తుంచుకోవాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో గొల్లపల్లి రిజర్వాయర్ (Gollapalli Reservoir)కు జీవో ఇచ్చిన హరీశ్ రావు, ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసుల కోసమే ప్రాజెక్టులు చేపట్టామని ఆరోపిస్తున్నారని.. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కాసుల కోసమే ప్రాజెక్టులు కట్టిందా? అంటూ ఎద్దేవా చేశారు.
మంత్రి మాట్లాడుతూ.. “సుమారు 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో 4 టీఎంసీల కంటే తక్కువగా ఉండే. కానీ 4.5 లక్షల ఎకరాలకు 45 టీఎంసీల నీళ్లు కావాలి. దీంతో 25 టీఎంసీల రిజర్వాయర్ కట్టి రైతులకు సాగునీరు అందించాలని అటు సమైక్య రాష్ట్రంలోనూ, తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ సర్కారు దృష్టికి తీసుకెళ్లాను. ఈ ప్రతిపాదనలతో 16 కుపైగా టీఎంసీలతో రిజర్వాయర్ల నిర్మాణానికి బీజం పడింది. అందులో భాగమైన గొల్లపల్లి రిజర్వాయర్ పనులనే మేం చేపడుతుంటే ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నారు?” అంటూ ప్రశ్నించారు.

