కలం, మహబూబ్నగర్ బ్యూరో: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో నాగర్కర్నూల్, మహబూబ్నగర్, నారాయణపేట, గద్వాలలో చేపట్టిన కీలక సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy Project Tour) పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) పిలుపునిచ్చారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎమ్మెల్యేలు, సంబంధితశాఖల అధికారులకు సూచించారు. మంగళవారం హైదరాబాద్లోని బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు.
ప్రజా ప్రతినిధుల మధ్య సమన్వయం అవసరం
ఈ సందర్భంగా పర్యటన మార్గం, భద్రతా ఏర్పాట్లు, ప్రజాప్రతినిధుల సమన్వయం, సాగునీటి ప్రాజెక్టుల వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లపై వివరంగా మంత్రులు అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. సాగునీటిరంగ అభివృద్ధి ద్వారా వ్యవసాయాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయితే రైతులకు వరం
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నిర్మితమవుతున్న నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తయితే ఈ ప్రాంత రైతులకు వరంగా మారుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 4, 5 తేదీల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా ప్రాజెక్టులను పరిశీలించి వాటి పురోగతిని తెలుసుకుంటారన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రాజెక్టుల ప్రాధాన్యత, వాటి ద్వారా సాగులోకి వచ్చిన కొత్తఆయకట్టు, రైతులకు కలిగిన ప్రయోజనాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలను సమగ్రంగా ముఖ్యమంత్రికి సూచించారు.
పర్యటనలో పాల్గొనే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, రవాణా, వైద్య సదుపాయాలు తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో అవసరమైన ముందస్తు చర్యలతో పాటు సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమమని, జిల్లాల వారీగా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి అన్ని ఏర్పాట్లను సమయానికి పూర్తి చేయాలని సూచించారు.
భద్రతా ఏర్పాట్ల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రజాప్రతినిధులు మరియు అధికారుల మధ్య సమన్వయం మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి సూచించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రాజెక్టుల సందర్శన పనుల పురోగతి తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉందని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. మహబూబ్నగర్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎస్పీ డీ జానకితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటన వివరాలు వివరిస్తూ, మహబూబ్నగర్ జిల్లాలో కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్లను సందర్శిస్తారని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఎస్పీ డీ జానకి, ఆర్డీవో నవీన్, ఇరిగేషన్శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

