కలం, వెబ్ డెస్క్: ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేసి రైతులకు అండగా ఉంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ అత్యంత ప్రాధాన్యతగా గుర్తించి, వేగవంతంగా పూర్తి చేయడానికి మేం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పనుల్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి, అవాంతరాలను తొలగించడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నామని అన్నారు.
ఇందులో భాగంగానే మంగళవారం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రధాన భాగమైన నార్లాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ పంప్ హౌస్, ప్యాకేజీ 3 వద్ద జరుగుతున్న పనులను పరిశీలించినట్లు చెప్పారు. పనులు జరుగుతున్న తీరును, వాటి పురోగతిని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మంత్రి పాటు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నారు.

