కలం, వెబ్ డెస్క్: జగిత్యాల కాంగ్రెస్ (Congress) సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి (Jeevan Reddy) పార్టీని వీడటం ఖాయమైంది. నేడు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జీవన్ రెడ్డిని కలిసి జరిపిన చర్చలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. పార్టీని వీడొద్దని, హైకమాండ్తో చర్చిస్తానని మహేశ్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చినా జీవన్ రెడ్డి పెద్దగా పట్టించుకోలేదు. మహేశ్ కుమార్ గౌడ్ తనను కలిసి వెళ్లిన కొద్ది సేపటికే జీవన్ రెడ్డి తన ఇంటిపై ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించేశారు. జీవన్ రెడ్డి అనుచరులు కాంగ్రెస్ జెండాలను సైతం చెత్త కుప్పలో పడేశారు. తన సమస్యకు తన దగ్గర కానీ, పార్టీ అధిష్టానం దగ్గర కానీ పరిష్కారం లేదని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు మహేశ్ కుమార్ గౌడ్ జీవన్ రెడ్డి ఇంటికి వచ్చిన వెంటనే ఆయన అనుచరులు అడ్డుకున్నారు, ఇప్పుడు ఎందుకు వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రేపు జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి, తన అనుచరులతో సమావేశం కానున్నారు. అనంతరం గ్రామాల్లో పర్యటించి తన రాజకీయ భవితవ్యంపై నిర్ణయం తీసుకోనున్నారు.

