ఇరాన్‌తో చర్చలు విఫలం: జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్​ : అమెరికా, ఇరాన్ దేశాల మధ్య పాకిస్థాన్ వేదికగా జరిగిన శాంతి చర్చలు ఎటువంటి ఒప్పందం కుదరకుండానే ముగిశాయి. ఇస్లామాబాద్‌లో దాదాపు 21 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ చర్చల అనంతరం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పాకిస్థాన్ కృషి చేసిందని, ఇరాన్‌తో అనేక కీలక అంశాలపై చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. అయితే చివరకు ఎటువంటి ఏకాభిప్రాయం కుదరకపోవడం విచారకరమని ఆయన అన్నారు.

ఈ చర్చలు విఫలం కావడం అమెరికా కంటే ఇరాన్‌కే ఎక్కువ నష్టమని వాన్స్ వ్యాఖ్యానించారు. తాము ప్రతిపాదించిన నిబంధనలను అంగీకరించేందుకు ఇరాన్ నిరాకరించిందని, అందుకే ఒప్పందం లేకుండానే తాము స్వదేశానికి తిరిగి వెళ్తున్నామని ఆయన తెలిపారు. ఇరాన్ సానుకూల నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఆ దేశంపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. పాకిస్థాన్ తన వంతుగా చర్చల గ్యాప్‌ను పూడ్చేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ, తుది నిర్ణయం విషయంలో ప్రతిష్టంభన కొనసాగిందని ఆయన వివరించారు.

ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయబోమని, వాటికి అవసరమైన సాంకేతికతను సమకూర్చుకోబోమని స్పష్టమైన నిబద్ధతను చాటుకోవాలని డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడి ప్రధాన లక్ష్యం ఇదేనని, చర్చల ద్వారా దీనిని సాధించడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన వివరించారు. ఇప్పటికే ఇరాన్‌కు చెందిన పలు అణు శుద్ధీకరణ కేంద్రాలు ధ్వంసమయ్యాయని పేర్కొన్న వాన్స్ (JD Vance), ప్రస్తుతానికి మాత్రమే కాకుండా దీర్ఘకాలంలో కూడా అణ్వాయుధాల తయారీకి దూరంగా ఉంటామనే ప్రకటన ఇరాన్ నుండి రావాల్సి ఉందన్నారు. అయితే ఇప్పటివరకు ఇరాన్ నుండి అటువంటి స్పష్టమైన హామీ లభించలేదని, భవిష్యత్తులో ఆ దేశం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అమెరికా ఆశిస్తున్న ఈ ప్రాథమిక నిబద్ధత లభించినప్పుడే చర్చలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>