కలం, వెబ్డెస్క్: ఐపీఎల్ (IPL) 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. దీంతో బీసీసీఐ (BCCI) ఫోకస్ అంతా ఇప్పుడు టీమిండియా తదుపరి అంతర్జాతీయ షెడ్యూల్పై పడింది. ఐపీఎల్ అయిన వెంటనే అప్ఘానిస్థాన్తో ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడనుంది భారత్. ఈ క్రమంలోనే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రాబోయే పది రోజుల్లో బోర్డుతో భేటీ కానుంది. ఈ భేటీలో జట్టులోని పేస్ బౌలర్ల వర్క్లోడ్ను ఎలా నిర్వహించాలనే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. రాబోయే తొమ్మిది నెలల్లో భారత్ మొత్తం తొమ్మిది టెస్టులు ఆడాల్సి ఉండటంతో, కీలక బౌలర్ల ఫిట్నెస్ సెలక్టర్లకు కీలకంగా మారింది.
ఈ ఏకైక టెస్టు కోసం జట్టు నాణ్యతలో ఏమాత్రం రాజీ పడకూడదని బీసీసీఐ భావిస్తోంది. అందుకే అఫ్గానిస్థాన్తో మ్యాచ్ అయినప్పటికీ, టీమ్ ఇండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను తుది జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లు యోచిస్తున్నారు. అయితే, మరో స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ (Mohammed Shami) విషయంలో మాత్రం సందిగ్ధత నెలకొంది. గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్లు ఆడని షమీని ఈసారి కూడా పక్కన పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేవలం ప్రత్యర్థి బలహీనంగా ఉందని టెస్ట్ క్యాప్లను సులభంగా పంపిణీ చేయకూడదని, అత్యుత్తమ లైనప్తోనే బరిలోకి దిగాలని బోర్డు భావిస్తోంది.

