కలం, జనగామ : జనగామ (Jangaon) జిల్లాలో పెట్రోల్ కొరత ఏర్పడిందనే వదంతులతో వాహనదారులు బంకుల వద్దకు పోటెత్తారు. ముఖ్యంగా జనగామ-హనుమకొండ రహదారిపై ఉన్న HPCL – TSRTC పెట్రోల్ పంప్ వద్ద ద్విచక్ర వాహనదారులు భారీ సంఖ్యలో క్యూ కట్టారు. పశ్చిమాసియా యుద్ధ మేఘాల నేపథ్యంలో ఇంధన సరఫరా ఆగిపోతుందనే ప్రచారంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉదయం నుంచే వందలాది మంది వాహనదారులు పెట్రోల్ కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు.
సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తల వల్ల కొందరు వాహనదారులు తమ ట్యాంకులను ఫుల్ చేయించుకోవడమే కాకుండా, బాటిళ్లలో కూడా నిల్వ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, తెలంగాణ పౌర సరఫరాల శాఖ, స్థానిక అధికారులు జిల్లా (Jangaon)లో ఎటువంటి ఇంధన కొరత లేదని స్పష్టం చేశారు. నిల్వలు నిరంతరాయంగా అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కాగా, జిల్లాలోని ప్రైవేట్ బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టడంతో ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఆర్టీసీ పెట్రోల్ బంకుల వద్ద రద్దీ మరింత పెరిగింది.

