కలం, జనగామ: ప్రజా సేవలో నిబద్ధత, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా (Sandeep Kumar Jha) సూచించారు. గురువారం జిల్లా సమీకృత కలెక్టరేట్లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్తో కలిసి ట్రైనీ గ్రూప్-1 అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ట్రైనీ అధికారులు తమ విధుల్లో అంకితభావంతో పని చేయాలన్నారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అధికారులు తమ పని తీరులో నిజాయితీని, సమగ్రతను (Integrity) ప్రదర్శించాలని, తీసుకున్న సరైన నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.
సాంకేతికతతో పని సులభతరం:
మారుతున్న కాలానికి అనుగుణంగా అధికారులు కృత్రిమ మేధ (AI), డిజిటల్ సాధనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కార్యాలయాల్లో పారదర్శకతను పెంపొందిస్తూ, ప్రజల విశ్వాసాన్ని పొందాలని తెలిపారు. అధికారులు నిరంతరం నేర్చుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ మాట్లాడుతూ.. డిజిటల్ సాధనాల ద్వారా పనితీరును వేగవంతం చేయాలని, ప్రజల జీవన ప్రమాణాల పెంపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీఓ వసంత, అడిషనల్ డీఆర్డీఓ నూరుద్దీన్, డీపీఎంలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

