కలం, జనగామ: విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతలో రాజీ పడకూడదని జనగామ (Jangaon) జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను హెచ్చరించారు. ఆదివారం తరిగొప్పుల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వంటగదిని తనిఖీ చేసిన కలెక్టర్.. బియ్యం, పప్పులు, గుడ్ల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు ఇచ్చే అరటిపండ్ల బరువును, వండిన ఆహారాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి, రేపటి ఇంగ్లీష్ పరీక్షకు ప్రణాళికతో సిద్ధం కావాలని సూచిస్తూ వారికి ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు. ఈ తనిఖీలో విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

