కలం, వెబ్ డెస్క్: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను విమర్శించే వారికి ఆ పార్టీ నేత కిరణ్ రాయల్ (Kiran Royal) తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పవన్ కల్యాణ్ గురించి ఎవరైనా మాట్లాడితే ఇక ప్రెస్ మీట్లు ఉండవని, దాడులే ఉంటాయని హెచ్చరించారు. పవన్ కల్యాణ్పై ఇటీవల వస్తున్న ఆరోపణలు, ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు విమర్శలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నాగేశ్వర్ రావును అరెస్ట్ చేస్తారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంఘాల నేతలు, జర్నలిస్టులు, అమరవీరుల కుటుంబాలు పలువురు ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కు వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టారు. ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనిపై కిరణ్ రాయల్ మాట్లాడుతూ.. మహిళలకు మద్యం తాగించి తీసుకొచ్చి పవన్ పై విమర్శలు చేయించారన్నారు. ప్రతి ఒక్కరినీ దెబ్బకు దెబ్బ తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. నిజమైన జర్నలిస్టులు ఎవరూ అలా ప్రవర్తించరని, ఇది జర్నలిజానికే మచ్చ అని కిరణ్ రాయల్ వ్యాఖ్యానించారు.

