కలం, వెబ్ డెస్క్ : జమ్మూకశ్మీర్లోని రాజౌరి (Rajouri) జిల్లాలో శనివారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదుల కోసం సాగుతున్న ఒక కీలక యాంటీ టెర్రర్ ఆపరేషన్లో (Anti Terror Operation) పాల్గొన్న భారత సైన్యానికి చెందిన ఒక యువ అధికారి అదుపుతప్పి లోయలో పడి ప్రాణాలు కోల్పోయారు. మంజకోట ప్రాంతంలోని గంభీర్ ముగ్లాన్-దోరిముల్ దట్టమైన అటవీప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై అందిన పక్కా సమాచారంతో భద్రతా దళాలు గత 15 రోజులుగా విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం ‘ఆపరేషన్ షేరువాలి’ పేరిట మల్టీ-ఏజెన్సీ సెర్చ్ మిషన్ నిర్వహిస్తుండగా, ఊహించని ప్రమాదం జరిగింది.
ఈ ఆపరేషన్లో భాగంగా ముందుండి నడిపిస్తున్న 05 అస్సాం రైఫిల్స్కు చెందిన కెప్టెన్ (Army Captain) బీరేశ్వర్, అక్కడి కఠినమైన కొండ ప్రాంతంలో అడుగులు వేస్తూ అదుపుతప్పి ప్రమాదవశాత్తు ఒక లోతైన లోయలోకి జారిపడ్డారు. తోటి సైనికులు వెంటనే రంగంలోకి దిగి వేగంగా సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన కెప్టెన్ను రక్షించేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ, ఆయన అప్పటికే గాయాల కారణంగా కన్నుమూశారు.
దేశ రక్షణ కోసం కెప్టెన్ బీరేశ్వర్ (Beereshwar Goswami) చేసిన అత్యున్నత త్యాగం వృధా పోదని భారత సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ శౌర్యానికి, శహాదత్కు దేశం మొత్తం నమస్కరిస్తోందని, ఈ తీవ్ర దుఃఖ సమయంలో అమరవీరుడి కుటుంబానికి సైన్యం అండగా ఉంటుందని తెలిపింది. కాగా, కెప్టెన్ బీరేశ్వర్ భౌతిక కాయానికి పూర్తి సైనిక లాంఛనాలతో రీత్-లేయింగ్ సెరిమనీ నిర్వహించి, అనంతరం ఆయన స్వగ్రామానికి పంపించనున్నారు. ఈ ప్రమాదం జరిగినప్పటికీ ఉగ్రవాదుల కోసం అడవుల్లో సాగుతున్న వేట ఆగలేదని, భద్రతా దళాలు తమ ఆపరేషన్ను మరింత ఉధృతం చేశాయని సైనిక వర్గాలు వెల్లడించాయి.
Read Also: ఆ భూమి వేలానికి రెడీ? హెచ్ఎండీఏ సంచలన నిర్ణయం!
Follow Us On: Sharechat

