కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేడు ఉప్పల్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) పరిధిలోని ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలను అందించేందుకు ఉప్పల్ భగాయత్లో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన నూతన కార్యాలయ భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు సా. 6 గంటలకు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రాజెక్ట్కు సంబంధించిన భూమి పూజ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రూ. 1474 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు.
ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో సుమారు 9 ఎకరాల విస్తీర్ణంలో నూతన కార్యాలయ భవనాన్ని నిర్మించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.99 కోట్ల నిధులను కేటాయించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా భావిస్తున్న ఈ నిర్మాణం ద్వారా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్కు శాశ్వత పరిపాలనా కేంద్రం అందుబాటులోకి రానుంది. ఈ కార్యాలయం మూసీ నది ఒడ్డున ఉండి మల్కాజిగిరి ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించనుంది.

