కలం, వెబ్ డెస్క్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒడిశా రాష్ట్రం పూరీలోని జగన్నాథ రథయాత్ర (Jagannath Rath Yatra) వైభవోపేతంగా ప్రారంభం అయింది. ఏటా నిర్వహించే ఈ రథయాత్రకు దేశంలోని నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో పూరీ పురవీధులు కిక్కిరిశాయి. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర రథాలను లాగేందుకు అధిక సంఖ్యలో మంది భక్తులు తరలివచ్చారు. సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మే కొలువుదీరిన ఈ క్షేత్రంలో ఏటా నిర్వహించే జగన్నాథ రథయాత్రకు భక్తులు విశేష సంఖ్యలో తరలివస్తారు. ఆషాడ మాసంలో ప్రారంభమైన ఈ ఉత్సవాన్ని తిలకిస్తూ.. జగన్నాథుడి రథాన్ని లాగుతూ భక్తితో మునిగిపోయారు.
వర్షంలోనూ ఉప్పొంగిన భక్తి పారవశ్యం..
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రథయాత్రను భారీగా భక్తులు తరలి వచ్చారు. జగన్నాథుడి రథయాత్రలో హృదయాన్ని హత్తుకునే ఘటన చోటుచేసుకుంది. అత్యవసర పరిస్థితిలో ఓ రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్ రాగానే, భక్తులందరూ వెంటనే దారి ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. కిక్కిరిసిన భక్తుల నడుమ అంబులెన్స్ ఎలా వెళ్తుందనే ఆందోళనల నడుమ భక్తులు బాధ్యతగా దారి ఇవ్వడంతో అంబులెన్స్ వెళ్లిపోయింది. భక్తి, క్రమశిక్షణ, మానవ సేవకు ప్రతీకగా నిలిచిన ఈ ఘటనపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.
13 వేల మంది పోలీసులతో బందోబస్తు..
జగన్నాథుడి రథయాత్ర భద్రత కోసం ఒడిశా ప్రభుత్వం 13 వేల మంది పోలీసులు, 19 మంది ఐపీఎస్ అధికారులు, 473 సీసీటీవీలతో భారీ ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. పూరీ తర్వాత రెండో అతిపెద్ద రథయాత్ర అహ్మదాబాద్లో నిర్వహించారు. అహ్మదాబాద్లోని పూరీ చారిత్రాత్మక ఆలయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా తెల్లవారుజామునే మంగళ హారతి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.

