కలం, వెబ్ డెస్క్ : దేశరాజకీయాల్లో భారీ మార్పుకు కౌంట్డౌన్ మొదలైందా? కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్ (One Nation One Election)’ ప్రకారం ఒకేసారి అసెంబ్లీలకు, పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమం అయినట్టేనా? అనే ఆసక్తికర చర్చ దేశమంతటా మొదలైంది. దీనికి కారణం జమిలి ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమేనని కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇవ్వడమే. ఆరు నెలల సమయం ఇస్తే దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటామని కూడా ఈసీ పేర్కొన్నది. జమిలి ఎన్నికలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ స్టడీ చేస్తున్న క్రమంలో ఈసీ ప్రతినిధులు హాజరై పై అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా నివేదిక రూపంలో వెల్లడించారు. ఒకవైపు పార్టీలు, మరోవైపు మేధావులు, ఇంకోవైపు సోషల్ సైంటిస్టులతో ముమ్మరంగా సమావేశాలు జరుపుతున్న జేపీసీ తాజాగా ఎలక్షన్ కమిషన్ అభిప్రాయాన్ని తీసుకోడానికి ఆహ్వానించింది.
రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తున్నందున ఎన్నికల నిర్వహణలో ఈసీకి ఉన్న ప్రాక్టికల్ ఇబ్బందులను కూడా తెలుసుకున్నది. ఇదే విషయాన్ని జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి (PP Chaudhary) లక్నోలో మీడియాతో మాట్లాడుతూ.. ఆరు నెలల సమయం ఇస్తే తగిన ఏర్పాట్లు చేసుకుని జమిలి ఎన్నికలను (One Nation One Election) నిర్వహించడాని సిద్ధంగా ఉన్నదని ఈసీ ఇచ్చిన నివేదికను ధృవీకరించారు. కానీ జమిలి ఎన్నికలను ఏ పద్ధతిలో నిర్వహిస్తారో, దానికి అదనంగా కావాల్సిన మ్యాన్ పవర్, ఎక్విప్మెంట్.. ఇలాంటి అంశాలపై ఈసీ (EC) నుంచి మరింత వివరణ తీసుకోవాల్సి ఉన్నదని, ఇంకోసారి సమావేశమైన తర్వాతనే స్పష్టత వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తాము తుది నివేదికను సమర్పించే సమయానికి ఈసీ నుంచి వివరణ తీసుకుని వాటిని పొందుపరుస్తామని, జమిలి ఎన్నికల్లోని అనుకూల, ప్రతికూల అంశాలను కూడా ప్రభుత్వానికి వివరించి తగిన సిఫారసులు చేస్తామని తెలిపారు.
Read Also: ఇన్చార్జ్ మంత్రులు ‘లైట్’.. ఆఫీసర్ల ‘సైలెంట్’!
Follow Us On : WhatsApp

