కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు (Patancheru) మండలం రామేశ్వరం వద్ద ఔటర్ రింగ్ రోడ్డు (ORR) సర్వీస్ రోడ్డు సమీపంలో ఒక మహిళ దారుణంగా హత్యకు గురైంది. ఈ ఘటనకు సంబంధించి స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పటాన్చెరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అక్కడ విగతజీవిగా పడి ఉన్న మహిళను పటాన్చెరు పరిధిలోని అంబేద్కర్ కాలనీకి చెందిన మంజులగా పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, క్లూస్ టీమ్ సహాయంతో ఘటనా స్థలంలో లభించిన పలు కీలక ఆధారాలను సేకరించారు. అసలు ఆమెను ఎవరు హత్య చేశారు? ఏ కారణంతో ఈ దారుణానికి ఒడిగట్టారు? అనే కోణాల్లో పోలీసులు కేసు నమోదు చేసుకుని ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

