కలం, వెబ్డెస్క్: భారత ఫుట్బాల్లో అత్యున్నత లీగ్ అయిన ఇండియన్ సూపర్ లీగ్ (ISL) మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఫెడరేషన్ ప్రతిపాదించిన కొత్త ‘ఎంట్రీ ఫీజు’ నిబంధనలపై క్లబ్లు (Clubs) తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ ఇదే పద్ధతిని కొనసాగిస్తే, లీగ్ నుండి తప్పుకోవడానికి కూడా వెనుకాడబోమని ఏకంగా 14 క్లబ్లు అఖిల భారత ఫుట్బాల్ ఫెడరేషన్ (AIFF)ను హెచ్చరించాయి. లీగ్ వాణిజ్య భాగస్వామిగా ఉన్న ఎఫ్ఎస్డీఎల్ తప్పుకోవడంతో ఏఐఎఫ్ఎఫ్ ఆదాయం భారీగా తగ్గింది. ఈ లోటును పూడ్చుకోవడానికి వచ్చే సీజన్ నుండి ప్రతి క్లబ్ సుమారు రూ. 3 కోట్ల ఎంట్రీ ఫీజు చెల్లించాలని ఫెడరేషన్ ప్రతిపాదించింది.
అయితే, ఇప్పటికే భారీ నష్టాల్లో ఉన్న తమను కేవలం ‘ఖర్చు కేంద్రాలు’గా చూడటం సరికాదని క్లబ్లు మండిపడుతున్నాయి. ఈ మేరకు ఫెడరేషన్ డిప్యూటీ సెక్రటరీ జనరల్కు పంపిన ఈమెయిల్లో తమ ఆవేదనను వ్యక్తం చేశాయి. క్లబ్ల హెచ్చరికలపై ఏఐఎఫ్ఎఫ్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎం. సత్యనారాయణ స్పందిస్తూ.. క్లబ్లపై భారం వేయాలనే ఉద్దేశం తమకు లేదని వివరణ ఇచ్చారు. రూ. 3 కోట్ల ఫీజు అనేది కేవలం ప్రతిపాదన మాత్రమేనని, దీనిపై ఎగ్జిక్యూటివ్ కమిటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే క్లబ్ యజమానులు ఫెడరేషన్ ప్రెసిడెంట్తో నేరుగా సమావేశం కావచ్చని ఆయన సూచించారు.

