కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఆక్వా ఉత్పత్తుల (AP Aqua Products)పై ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఎగుమతులు, రొయ్యల ధరలు తగ్గడంతో గోదావరి జిల్లాల్లోఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే రొయ్యల ఫీడ్ ధరలు, కరెంట్ చార్జీల మోతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు యుద్ధం మరో గుదిబండలా మారింది. ఎగుమతిదారుల నిలువ సామర్థ్యం కంటే ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి జరుగుతోంది. దీంతో ఇతర రాష్ట్రాల బయ్యర్లు ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు.
ట్రంప్ టారిఫ్లు (Trump Tariffs) పెంచిన తర్వాత 2025 నుంచి అమెరికాకు ఎగుమతులు భారీగా తగ్గుముఖం పట్టాయి. దీంతో ఎగుమతిదారులు జపాన్, యూరప్, మిడిల్ ఈస్ట్లకు మార్కెట్ను విస్తరించారు. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు ఎగుమతులను తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయి. పశ్చిమ గోదావరిలో 5 పెద్ద కంపెనీలు మొదలుకొని 70 వరకు ఎక్స్పోర్ట్ కంపెనీలున్నాయి. మధ్య వర్తులుగా వ్యాపారం చేసేవారు 700 వరకు ఉంటారు. రైతులు పంట చేతికి రావడంతో పెద్ద ఎత్తున మధ్య వర్తులకే అమ్ముతున్నారు. పరిస్థితులను సాకుగా చూపిస్తూ ఎక్స్పోర్టర్లు, మధ్యవర్తులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే మరో పంట (AP Aqua Products) వేసే పరిస్థితి ఉండదంటున్నారు. ప్రభుత్వం కలుగజేసుకొని న్యాయం జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
Read Also: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరొకరు మృతి!
Follow Us On: Instagram

